స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాడ్ కాస్ట్ ఎంత పాపులరో తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ పేరుతో నడిచే పాడ్ కాస్ట్లో ఆయన అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుతుంటారు.
ఐతే అప్పుడప్పుడూ ఆయన చర్చించే రాడికల్ కాన్సెప్ట్స్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా ఆయన దేవుళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
భర్తలు ఎలా ఉన్నా భరించాల్సిందేనని చెబుతూ.. విషయం దేవుళ్ల మీదికి మళ్లించి కాంట్రవర్శల్ కామెంట్లు చేశారు.
ప్రతి మగాడిలోనూ లోపాలు ఉంటాయని.. వాళ్లు తల్లులు అనుకున్నంత మంచి వాళ్లు కాదని, అలాగే భార్యలు అనుకునేంత దుర్మార్గులు కారని పూరి అన్నారు. భర్తలు ఎలా ఉన్నా భార్యలు భరించాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు.
భర్తలను తప్పుబట్టే ముందు తమ తండ్రులు ఎలా ఉండేవాళ్లో, తమ తల్లులను ఎంతగా ఇబ్బంది పెట్టేవారో ఒకసారి భార్యలు గుర్తు చేసుకోవాలని ఆయనన్నారు. భర్తను కూడా తమ తండ్రిని, అన్నను, తమ్ముడిని క్షమించినట్లే క్షమించాలని పూరి సూచించారు. ఏ భర్తా భార్యను సంతృప్తిపరచలేడని చెబుతూ.. ఈ విషయంలో మహిళలు కొలిచే దేవుళ్లు కూడా మినహాయింపు కారని పూరి అన్నారు.
శ్రీరాముడి వల్ల ఆయన భార్య సీతాదేవి ఎంత కష్టాలు పడిందో తెలియదా అని పూరి ప్రశ్నించారు. సామాన్య మహిళలు దేవుళ్లను పెళ్లి చేసుకుంటే వాళ్లకు లెక్కలేనన్ని ఇబ్బందులు ఉంటాయన్నారు పూరి. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా దేవుడు వెళ్లిపోతాడని.. అసలు ఇంట్లోనే ఉండడని.. భార్యకు సమయం కేటాయించడని పూరి చెప్పాడు.
ఈ క్రమంలో ఎక్కడో ఎవరో ముండ తన భర్తను కోల్పోతే అక్కడికి దేవుడు వెళ్లిపోతాడంటూ పూరి చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపింది. మహిళలకు సలహాలు ఇవ్వాలంటే ఇవ్వొచ్చు కానీ.. మధ్యలో దేవుళ్ల టాపిక్ తేవడం, ఇలాంటి కామెంట్లు చేయడం ఎంత వరకు సబబు అంటూ పూరి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. హిందూ దేవుళ్ల మీద ఇలాంటి కామెంట్లు సెలబ్రెటీలకు ఫ్యాషన్ అయిపోయిందంటూ.. తన వ్యాఖ్యలపై పూరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

